నాకు నిన్ననే తెలిసిన ఒక విషయం మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను.
కర్ణాటకలో వినాయక చవితిని గౌరీగణేశ హబ్బ అంటారు. అంటే గౌరీగణేశ పండుగ. ముందు రోజు గౌరీ పూజ చేసి తర్వాతి రోజు వినాయక చవితి చేస్తారు. మనం వినాయక చవితి మాత్రమే చేస్తాము. ముందు రోజు గౌరీ దేవిని ఆరాధించడం మన దగ్గర లేదు. కర్ణాటకలో ఇలా గౌరీ మరియు గణేశ ఎందుకు చేస్తారు అని అడిగినప్పుడు నాకు నా ఫ్రెండ్స్ చెప్ని సమాధానం ఏమిటంటే...
గౌరీ దేవి వరలక్ష్మీ వ్రతం కోసం తన పుట్టింటికి వచ్చింది. తన పుట్టిల్లు అంటే ఏమిటి, తను పర్వత రాజు కూతురు కదా... హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీ లలితే. అంటే పార్వతీ దేవి భూలోకానికి వచ్చిందన్నమాట. పండుగ అయిపోయిన తర్వాత రోజులు గడుస్తున్నా కూడా తను ఇంకా మెట్టినింటికి శివుని దగ్గరకు వెళ్లలేదు. పుట్టింటి ప్రేమ మరి. పార్వతమ్మను తీసుకురమ్మని శివుడు వినాయకుని భూలోకానికి పంపుతాడుట. మీ అమ్మను తీసుకురా పో అని. అలా గణేశుడు భూలోకానికి వస్తాడు. అదే గణేశ చతుర్థి లేదా మన వినాయక చవితి. ఇక వినాయకుడు కూడా 9 రోజుల పాటు ఇక్కడే తిష్ట వేస్తాడట. మరి మన ఉండ్రాళ్ల మహిమ అది.. ఇక లాభం లేదని శివుడు వీళ్లిద్దరినీ తీసుకురమ్మని గంగమ్మ తల్లిని భూలోకానికి పంపుతాడట. అదేనండీ వర్షాలు. అందుకే వినాయక నవరాత్రులలో ఒక్కరోజైనా ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఇలా ఒకరి కోసం మరొకరు వచ్చి పార్వతీ దేవి, వినాయకుడు, గంగమ్మా ముగ్గురూ ఇక్కడే తిష్ట వేస్తారు.
శివునికి ఎక్కడ కోపం వస్తుందో అని మనం బతుకమ్మ పండుగ సమయంలో బతుకమ్మలో పైన గౌరమ్మను పెట్టి, పూజ చేసి, నైవేద్యాలు పెట్టి, పాటలతో ఆటలతో అమ్మవాారిని ధ్యానించి... పోయిరా మాయమ్మ పోయిరావమ్మా, పోయి మీ అత్తింట్లో బుద్ది కలిగుండు, ఎవరేమన్ననూ ఎదురాడబోకు అని పాడుతూ ఆ అమ్మవారిని నీళ్లలో వదులుతాము.
ఇలా భగవంతుడిని మనలో ఒకరిగా, భగవంతునితో మనం నిత్యం మాట్లాడుతున్నట్టుగా, దేవుడిని మన నిత్య జీవితంలో ఒక భాగంగా భావించడమే భక్తి అంటే.
అందరు ఆడ పిల్లల లాగానే పర్వత రాజు కుమార్తె అయిన, పార్వతీ దేవి ఈరోజు వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి పుట్టింటికి, అంటే హిమాలయాలకు వచ్చింది.
హిమగిరి తనయే హేమలతే అని మనం పాడుకుంటాం కదా!
పండుగ అయిపోయిన తర్వాత రోజులు గడుస్తున్నా కూడా తను ఇంకా మెట్టినింటికి శివుని దగ్గరకు వెళ్లలేదు. పుట్టింటి ప్రేమ అలాంటిది కదా మరి
No comments:
Post a Comment